⚡వరదయ్యపాలెం: మండలంలోని మేజర్ పంచాయతీ సచివాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారుల దరఖాస్తులు, ఇతర ఆన్లైన్ ప్రక్రియలు పూర్తి చేయడంలో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సేవల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
🌲సచివాలయంలో ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో సిబ్బంది లబ్ధిదారుల మొబైల్ డేటాను వినియోగించుకుని కంప్యూటర్లలో దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయంలోనే మౌలికమైన ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెట్ సమస్య కారణంగా పెన్షన్ ప్రక్రియ ఆలస్యమవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
🔥రూ.1,000 బిల్లు చెల్లించినా.. నెట్ ఏదీ?
🌈సచివాలయానికి ఇంటర్నెట్ సౌకర్యం కోసం జనవరి నెలలో రూ.1,000 బిల్లు చెల్లించినప్పటికీ ఇప్పటివరకు బిల్లు అందలేదని వరదయ్యపాలెం ఈఓ తెలిపినట్లు సమాచారం. బిల్లు చెల్లింపులు జరిగినప్పటికీ సచివాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
🎋డిజిటల్ అసిస్టెంట్ ఒక్కరే.. సేవలు కష్టమే!
🌱మేజర్ పంచాయతీలోని రెండు సచివాలయాలకు డిజిటల్ అసిస్టెంట్ ఒక్కరే ఉండటంతో ప్రజలకు సకాలంలో సేవలు అందించడం కష్టతరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రెండు సచివాలయాల ఆన్లైన్ పనులను ఒక్కరే నిర్వహించాల్సి రావడంతో పని భారం పెరుగుతోందని, దరఖాస్తులు, పెన్షన్లు, ఇతర డిజిటల్ సేవల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.
⚡ఇంటర్నెట్ సమస్యతో పాటు సిబ్బంది కొరతను కూడా వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. రెండు సచివాలయాలకు అవసరమైన సిబ్బందిని కేటాయించి, నిరంతర ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించి ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

