భూపాలపల్లి: గ్యాస్ ప్రమాదాలను నివారించడంతో పాటు వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన MANDATORY INSPECTION ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహించుకోవాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వచ్చి గ్యాస్ కనెక్షన్, రెగ్యులేటర్, స్టవ్, సేఫ్టీ ట్యూబ్ తదితర అంశాలను పరిశీలించి తప్పనిసరి తనిఖీ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.
గ్యాస్ సురక్ష ట్యూబ్ కాలపరిమితి ముగిసినట్లయితే వెంటనే దానిని మార్చుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్యాస్ ప్రమాదాల నుంచి ముందస్తు రక్షణ కోసం సేఫ్టీ ఫైర్ బాల్స్, ఆప్రాన్ వంటి భద్రతా పరికరాలను వినియోగించుకోవాలని తెలిపారు.
గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారుడు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో, ఆ గ్యాస్ కనెక్షన్ను కుటుంబ సభ్యుల పేరుపై బదిలీ చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో భవిష్యత్తులో గ్యాస్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే ప్రతి గ్యాస్ వినియోగదారుడు e-KYC ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్యాస్ భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తూ, తప్పనిసరి తనిఖీలు మరియు e-KYC ప్రక్రియను పూర్తి చేసి సంబంధిత సిబ్బందికి వినియోగదారులు సహకరించాలని పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్ గారు కోరారు.


