పారా లీగల్ వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం
విజయనగరం, జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 28. (పున్నమి ప్రతినిధి )
జిల్లా కోర్టు ప్రాంగణంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం పారా లీగల్ వాలంటీర్లకు (పి యల్ వి ఎస్ ) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కార్యదర్శి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా లీగల్ ఎయిడ్ క్లినిక్ల పనితీరును ఏ విధంగా పరిశీలించాలి, న్యాయ సహాయం అవసరమైన వ్యక్తులను గుర్తించి వారికి న్యాయ సేవలు అందేలా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాలపై వివరించారు.
అదేవిధంగా జైలు సందర్శన సమయంలో పాటించాల్సిన విధానాలు, ఖైదీలకు అందుబాటులో ఉన్న న్యాయ సహాయం, వారి సమస్యలను సంబంధిత న్యాయ సేవా సంస్థల దృష్టికి తీసుకెళ్లే విధానం గురించి (పి ఎల్ వి ఎస్) కు అవగాహన కల్పించారు.
పారా లీగల్ వాలంటీర్లు విధుల్లో భాగంగా నిర్వహించాల్సిన రికార్డులు, రిజిస్టర్లు, కేసులకు సంబంధించిన వివరాల నమోదు, న్యాయ సహాయం కోరుతున్న వారి వివరాలను సక్రమంగా నమోదు చేయడం వంటి అంశాలపై కూడా శిక్షణ ఇచ్చారు.
ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా పారా లీగల్ వాలంటీర్లు సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా కార్యదర్శి సూచించారు.



