సూళ్లూరుపేట ఆగష్టు 26
తడ మండలం కొండూరు రైల్వే లెవెల్ క్రాసింగ్ (LC) గేట్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తిని రైలు బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 50 నుండి 55 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అతని వివరాలు ఇంకా తెలియరాలేదు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్) పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడు ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.


