స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
రాష్ట్ర అధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్
కడప ఆగస్టు 21
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఎన్నికల ప్రక్రియను జాప్యం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని లోకసత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కడప నగరం వైయస్సార్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వెంటనే నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసిందని, దాని వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత పరిస్థితులను పునరావృతం చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను కూడా వెంటనే ప్రకటించి, ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని సి. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ప్రజలకు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పయ్యావుల వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు దేవర శ్రీకృష్ణ, లోకసత్తా నాయకులు రెడ్డయ్య, జోహార్ వలి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



