వైరాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం సీజ్
బియ్యం వ్యాపారిపై 6ఏ కేసు నమోదు
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆగస్టు 18
వైరా:
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వైరా ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది బృందంగా ఏర్పడి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, అష్ణగుర్తి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుబడింది.
అధికారుల వివరాల ప్రకారం.. అష్ణగుర్తి గ్రామానికి చెందిన బియ్యం వ్యాపారి బలగాని నరసింహారావు ఓ పాడుబడిన ఇంట్లో తెల్లటి ప్లాస్టిక్ సంచుల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు తనిఖీల్లో గుర్తించారు. మొత్తం 19 సంచుల్లో సుమారు 9.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో బియ్యాన్ని సీజ్ చేసి, తదుపరి భద్రతా చర్యల నిమిత్తం సంబంధిత రేషన్ డీలర్కు అప్పగించారు. బలగాని నరసింహారావుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కొణిజర్లలోనూ విస్తృత తనిఖీలు
ఇదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం కొణిజర్ల మండలంలోని పలు రేషన్ షాపులను కూడా ఆకస్మికంగా తనిఖీ చేసింది. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో డీలర్లు లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం బియ్యం అందిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు.
రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా అధికారులు రికార్డులు, నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించినట్లు తెలిసింది. లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు బియ్యం అందుతున్నదీ లేనిదీ తనిఖీల ద్వారా నిర్ధారిస్తున్నారు.
ప్రతిరోజూ ఆకస్మిక తనిఖీలు
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ప్రతిరోజూ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జిల్లాలోని వివిధ మండలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ నిల్వ, తరలింపు, విక్రయాలు వంటి వాటిపై నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, పక్కదారి పట్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమాలకు గురికాకుండా నిరంతర తనిఖీలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.



