ఆత్మకూరు, జూలై 1 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఏఎస్ పేట మండలం శ్రీకొలను గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
పాఠశాల విద్యార్థుల సాదర ఆహ్వానం మేరకు ఆయన పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో హాకీ క్రీడల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి ఆనం ప్రత్యేకంగా అభినందించారు.గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులను ఆయన అభినందించారు.
- కె. చెంచులక్ష్మి – అండర్-17 జాతీయ SGF హాకీ పోటీలు
- ఏ. రిషిత – అండర్-14 జాతీయ హాకీ పోటీలు
- జి. నవ్యశ్రీ – అండర్-14 జాతీయ హాకీ పోటీలు
- ఎం. కీర్తన – జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-17 హాకీ పోటీలు
వీరిని తీర్చిదిద్దడంలో కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు థామస్ పీటర్తో పాటు ఉపాధ్యాయులను మంత్రి ఆనం అభినందించారు.విద్యార్థులకు మరింత మెరుగైన క్రీడా వసతులు కల్పించేందుకు పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్రీడా మైదానం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలతో అధికారులు హాజరు కావాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తారని మంత్రి అన్నారు. శ్రీకొలను ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని ఆధునికీకరించడంతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి త్వరలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్, మండల పరిషత్ అధికారులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.



