పున్నమి ప్రతినిధి ఆనంద్ :
గొలగాం సర్వే నంబర్ 137/3లోని భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద బాధిత భూ యజమానులతో కలిసి సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. 2012లో సమృద్ధి వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసి, సబ్బవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను ప్రస్తుతం 22ఏలో చేర్చడం అన్యాయమన్నారు. అప్పట్లో కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్ఓసీ కూడా జారీ అయిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్ఓసీలను పరిశీలించి సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన భూ యజమానుల భూములను 22ఏ నుంచి తొలగించాలని కోరారు.
సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తహశీల్దార్ కార్యాలయం వద్ద వంటా వార్పు చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు, అనకాపల్లి మండల కన్వీనర్ గంట శ్రీరామ్, డి.రమణ, గొలగాం భూ యజమానులు పాల్గొన్నారు.


