గ్రామాభివృద్ధిపై ప్రభావం పడుతుందనే చర్చ.. అధికారిక స్పందన కోసం ఎదురుచూపుల.
వాంకిడి, ఆగష్టు 2(పున్నమి ప్రతినిది): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ పాలకవర్గంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కొందరు వార్డు సభ్యుల మధ్య సమన్వయం లోపించిందనే ప్రచారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామసభల నిర్వహణ వంటి అంశాల్లో అందరి అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.
గ్రామపంచాయతీ ఎన్నికల రాజకీయాల ప్రభావమే ప్రస్తుతం పాలకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితులకు కారణమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధికారిక కార్యక్రమాల్లో సభ్యులంతా కలిసి కనిపిస్తున్నప్పటికీ, నిర్ణయాల విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయనే ప్రచారం వినిపిస్తోంది.
పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, సంక్షేమ పథకాల అమలు వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సభ్యుల మధ్య సమిష్టి సమన్వయం అవసరమని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామసభలను పారదర్శకంగా నిర్వహించి ప్రతి సభ్యుడి అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందన్నది సంబంధిత ప్రజాప్రతినిధుల అధికారిక స్పందన అనంతరమే స్పష్టత వచ్చే అవకాశం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల వివరణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.


