శాంతి, సామరస్యం, సోదరభావంతో మీలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకోవాలని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు.
మీలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం
ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో
నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ
పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని సూచించారు.
మతపరమైన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఊరేగింపులు, ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రభుత్వ నిబంధనలు, పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు.
మతాల మధ్య పరస్పర గౌరవం, సామరస్యం, సోదరభావాన్ని కాపాడేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే లేదా మత విద్వేషాలను పెంచే పోస్టులను ప్రచారం చేయవద్దని, అలాంటి సమాచారాన్ని నమ్మకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మీలాద్ ఉన్ నబీ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ తరఫున అవసరమైన బందోబస్తు, భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో శాంతి కమిటీ సభ్యులు, మత పెద్దలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో ఇన్స్పెక్టర్ కరుణాకర్,బాలకృష్ణ, మోహన్ బాబు, భాను ప్రకాష్ పాల్గొన్నారు.



