వేల్పూర్ పరిధిలో గల కుండలిని జ్ఞానయోగి అవధూత శ్రీ శ్రీ శ్రీ గోవిందగిరి స్వామి దివ్య యోగాశ్రమంలో ఈనెల 22 బుధవారం నుండి ఈనెల 28 మంగళవారం వరకు “సప్తభజన” మహత్కార్యాన్ని నిర్వహిస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలోని ఉత్సాహవంతులైన భజన కళాకారులు 24 గంటలు, వారం రోజులపాటు నిరంతరాయంగా జరిగే సప్త భజనలో పాల్గొని భజన పాటలు పాడి మీ ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించండి అని కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆశ్రమ ప్రాంగణంలోని గోవిందగిరి కళ్యాణ మండపం వేదికగా సప్త భజన కార్యక్రమాలు కొనసాగుతాయి. భజన కళాకారులకు ఇది సువర్ణావకాశం. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఇట్టికార్యాన్ని తల పెట్టాము. భగవంతుని చేరడానికి హిందూ సనాతన ధర్మంలో తొమ్మిది రకాల భక్తి మార్గాలను నవవిధభక్తి అని పిలుస్తారు. భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం ప్రకారం ప్రహ్లాదుడు మరియు శ్రీరాముడు శబరికి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనే నవవిధభక్తి మార్గాలున్నాయి. భక్తి మార్గంలో ఈ తొమ్మిది పద్ధతులను ఆచరించడం ద్వారా భగవదనుగ్రహం ముక్తి లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ శుభ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఇట్టి సత్కార్యంలో జిల్లాలోని సమస్త భక్తజనులు పాల్గొని కార్యక్రమాల్ని విజయవంతం చేయగలరని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.




