– భక్తుల రాకపోకలు, ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి
– అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు, కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులతో కలిసి బుధవారం ఓబుళవారిపల్లి మండలం మంగంపేట చెరువు, చిట్వేల్ మండలం ఎల్లంరాజు చెరువు వద్ద నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, బందోబస్తు, నిమజ్జన ప్రదేశాల వద్ద భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని డీఎస్పీ కోరారు. పరిశీలనలో కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులతో, ఓబుళవారిపల్లి ఎస్ఐ సుజన్ కుమార్, చిట్వేల్ ఎస్ఐ ఎస్. వినోద్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


