విశాఖపట్నం జిల్లా,ఆనందపురం,( పున్నమి ప్రతినిధి )ఆగస్టు 23::
సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డంకి కాదని నిరూపించింది శోంఠ్యం గ్రామానికి చెందిన బొద్దపు జ్యోత్స్న. మట్టిలో పుట్టిన మాణిక్యంలా మెరిసి, కరాటే క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ రెండు పతకాలను సాధించింది.
ఈనెల 22, 23 తేదీల్లో విశాఖపట్నంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన 3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో జ్యోత్స్న 16 సంవత్సరాల 38 కిలోల విభాగం కుమిటే (ఫైట్)లో గోల్డ్ మెడల్, 16 సంవత్సరాల కటా విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటింది.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శోంఠ్యం గ్రామానికి చెందిన జ్యోత్స్న, ప్రస్తుతం ప్రగతి ఒకేషనల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం (MPHW) చదువుతోంది. చదువుతో పాటు తనకు ఎంతో ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతూ, క్రీడల్లోనూ రాణిస్తోంది.
పేదరికాన్ని పట్టించుకోని ప్రతిభ.. తల్లిదండ్రుల త్యాగమే బలం
కుటుంబం లో ఇద్దరు ఆడపిల్లలు వున్నా . తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివించుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తమ చిన్న కుమార్తెకు ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పిస్తూ ఆమె ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు.
తల్లిదండ్రుల కష్టం, గురువుల శిక్షణ, తనలోని పట్టుదల కలిసివచ్చి జ్యోత్స్నను విజయపథంలో నడిపిస్తున్నాయి. కష్టపడితే ఏ నేపథ్యం నుంచైనా విజయాన్ని సాధించవచ్చని ఆమె రెండు పతకాలతో నిరూపించింది.
జ్యోత్స్న సాధించిన విజయాన్ని కోచ్ పోతిన ప్రవీణ్ తెలియజేశారు.
“మట్టిలో మాణిక్యాలు పుడతాయి.. కానీ వాటిని వెలుగులోకి తీసుకురావాలంటే తల్లిదండ్రుల త్యాగం, గురువుల ప్రోత్సాహం, పిల్లల పట్టుదల అవసరం. జ్యోత్స్న సాధించిన ఈ విజయం శోంఠ్యం గ్రామానికే కాదు.. ప్రతి పేద కుటుంబంలోని ప్రతిభావంతమైన బిడ్డకు స్ఫూర్తి.”
భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జ్యోత్స్నను పలువురు అభినందించారు. “నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది జ్యోత్స్న.. ఈ బంగారు అడుగులు రేపటి గొప్ప విజయాలకు బాటలు వేయాలి!”











