మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ పోలీస్ బెటాలియన్లో ఆదివారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కె. ఆనందరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ/అసిస్టెంట్ కమాండెంట్ కె. వెంకటప్ప ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి కె. వెంకటప్ప పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడడంతో పాటు ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా నిలబడిన ఆయన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు.
ప్రకాశం పంతులు ఆశయాలు, దేశభక్తి, ప్రజాసేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఆంధ్రకేసరికి ఘన నివాళులర్పించారు.


