తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ హెచ్చరిక
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరులో గత మూడు రోజులుగా “ప్రతి మహిళకు ₹1500” పేరుతో సైబర్ కేటుగాళ్లు మహిళలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాము సచివాలయం నుండి మాట్లాడుతున్నామని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకానికి ఎంపిక అయ్యారని నమ్మిస్తూ కొందరు మహిళల నుంచి ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.ఈ విషయంపై గురువారం ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ స్పందిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. “ప్రస్తుతం మహిళలకు ₹1500 అందించే ఎలాంటి ప్రభుత్వ పథకం అమలులో లేదు. సచివాలయం నుండి ఎవరూ ఫోన్ చేసి డబ్బులు అడగరు. ఇలాంటి తప్పుడు కాల్స్ను ప్రజలు నమ్మవద్దు” అని స్పష్టం చేశారు.సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సచివాలయం లేదా ప్రభుత్వ అధికారుల పేర్లు చెప్పి ఫోన్ చేసినా వెంటనే స్పందించకుండా ముందుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా ఎవరికి డబ్బులు పంపవద్దని, వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. ఇటువంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.ప్రజలు అవగాహనతో వ్యవహరించి సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ విజ్ఞప్తి చేశారు.


