ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి)
ముథోల్ :మండల కేంద్రమైన ముథోల్ కు చెందిన రమేష్, జ్యోతి దంపతుల కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. రెండో, మూడవ సంతానం పుట్టిన వెంటనే మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నాల్గోవ సంతానం పుట్టిందన్న సంతోషం కూడా ఎంతోసేపు నిలవకముందే మరో విషాదం వారిని కుదిపేసింది. కళ్లు కూడా సరిగా తెరవని పసికందు ప్రస్తుతం నిజామాబాద్లోని ఓ ఆస్పత్రిలోని ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. పసికందు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి జ్యోతి భైంసాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రమేష్, జ్యోతి దంపతుల కుటుంబ పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉంది. రేకుల ఇంట్లో నివసిస్తూ, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో నవజాత శిశువుకు ఖరీదైన వైద్యం అవసరం కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తన బిడ్డను ఎలాగైనా కాపాడాలని తల్లి చేతులు జోడించి కన్నీటితో వేడుకుంటున్న దృశ్యం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. అభం శుభం తెలియని ఆ పసికందు ప్రాణాల కోసం కుటుంబ సభ్యులు దాతల సహాయం కోరుతున్నారు. మానవత్వంతో స్పందించే దాతలు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించి పసికందు చికిత్సకు అండగా నిలవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు. సహాయం చేయదలచిన వారు 9100059340, 9704973532, 9966027148 ఫోన్ పే నెంబర్లకు పంపాలని కోరారు.



