తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూలై 13:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ధవళేశ్వరం బ్యారేజీతో పాటు జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును సందర్శించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనకు తాళ్లపూడి మండలం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లి సీఎంకు ఘన స్వాగతం పలికారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి డెల్టా రైతులకు సాగునీటి పంపిణీ, గేట్ల పనితీరు, వరద నివారణ చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రతి కాలువకు సకాలంలో సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి గోదావరి జిల్లాల రైతులకు శాశ్వత సాగునీటి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తాళ్లపూడి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, యువత భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.




