పెనుగోలు–ధర్మవరం నుంచి ఎస్.రాయవరం వరకు రహదారి విస్తరణకు ఎదురుచూపులు
అనకాపల్లి జిల్లా సెప్టెంబర్ 12 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
ఎస్.రాయవరం: వరహానది సమీపంలోని ఎన్హెచ్-5ను ఆనుకుని పెనుగోలు–ధర్మవరం నుంచి ఎస్.రాయవరం వైపు వెళ్లే సుమారు మూడు కిలోమీటర్ల రహదారి ఆర్అండ్బీ శాఖకు సవాల్గా మారింది. దశాబ్దాలుగా నాయకులు రోడ్డు విస్తరణపై హామీలు ఇస్తూ ప్రజల్లో ఆశలు రేకెత్తించడం, అనంతరం వాటిని మరిచిపోవడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ రహదారి పరిస్థితి ఇలా ఉండటం గమనార్హం.
మండల కేంద్రంగా ఉన్న ఎస్.రాయవరానికి సుమారు 28 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఎండీఎఫ్ఓ, తహసీల్దార్, పీడబ్ల్యూడీ తదితర కార్యాలయాలకు వెళ్లే ప్రజలు ఈ సింగిల్ రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకటి పడితే రహదారి ఎక్కడ ముగుస్తుందో, వాహనం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు వాపోతున్నారు. మత్స్యకారులు, కొబ్బరి వ్యాపారులు అధికంగా వినియోగించే ఈ రహదారిని తక్షణమే విస్తరించి, ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


