* విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి కలెక్టరేట్, ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి
ప్రకృతి వైద్యం ద్వారా ముందస్తు ఆరోగ్య పరిరక్షణ, డిజిటల్ వెల్నెస్పై రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో తిరుపతిలో రెండు రోజుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మహతి ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉద్యోగులు, ప్రకృతి వైద్యాన్ని అనుసరించేవారు, ఆరోగ్యంపై ఆసక్తి ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 29న విద్యార్థులకు, 30న ఉద్యోగులు, ప్రకృతి వైద్య అనుచరులకు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 29న ఉదయం 9.45 గంటలకు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా. మంతెన సత్యనారాయణ రాజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటల నుంచి ముందస్తు ఆరోగ్య సంరక్షణ, ప్రకృతి వైద్య విధానాలు, జీవనశైలి మార్పుల ద్వారా ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తారు. ఉదయం 11.30 గంటలకు డిజిటల్ వెల్నెస్ కోచ్ బాలా కిషోర్ డిజిటల్ యుగంలో ఆరోగ్యకరమైన జీవన విధానాలు, డిజిటల్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిజిటల్ డీటాక్స్ ఆవశ్యకతపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ‘ఆహారమే ఔషధం–వంటగదే వైద్యశాల’ అనే అంశంపై డా. మంతెన సత్యనారాయణ రాజు అవగాహన కల్పిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు బాలా కిషోర్ ఆధ్వర్యంలో డిజిటల్ డీటాక్స్ సెషన్ నిర్వహించనున్నారు. ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణ, డిజిటల్ వినియోగంపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత వర్గాల వారు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


