చిట్టమూరు: కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం చిట్టమూరు జీఎంఎన్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి ఇన్చార్జి ఎంపీడీవో విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, పోషకాహార కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు, బాలింతల సంరక్షణ వంటి అంశాలపై కార్యకర్తలు అవగాహనతో పనిచేయాలని సూచించారు.
జ్ఞానజ్యోతి శిక్షణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లలలో అభ్యసన సామర్థ్యాల పెంపు, పోషకాహార ప్రాధాన్యత, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు వేదికలుగా నిలిచేలా కార్యకర్తలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణలో చురుగ్గా పాల్గొని వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు. శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేసి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించాలని నిర్వాహకులు సూచించారు.
కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు ఎంపీడీవో భూపయ్య,సూపర్వైజర్ కవిత, రీసెర్చ్ పర్సన్ బాస్కర్, వేణు , అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


