ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి న్యూస్)
తెలంగాణ వ్యవసాయ విధానాలు, సాంకేతికత, పంటల వైవిధ్యీకరణపై బిహార్ ప్రభుత్వం ఆసక్తి వ్యక్తం చేసింది. బిహార్ వ్యవసాయశాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా బుధవారం తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వ్యవసాయరంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, రైతుల సంక్షేమ పథకాలు, పంటల వైవిధ్యీకరణపై చర్చించారు.
తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, రైతుభరోసా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాలను మంత్రి తుమ్మల వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. క్రాప్ బుకింగ్, శాటిలైట్ ఆధారిత పంటల పర్యవేక్షణ, అగ్రిస్టాక్, వాతావరణ హెచ్చరికలు, కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస్’ వంటి సాంకేతిక కార్యక్రమాలను వివరించారు.
ఆయిల్పామ్పై బిహార్ ఆసక్తి: తెలంగాణలో ఆయిల్పామ్ సాగు, నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, మైక్రో ఇరిగేషన్ విధానాలపై బిహార్ మంత్రి ఆసక్తి చూపారు. తమ రాష్ట్రంలోనూ ఆయిల్పామ్ సాగును పరిశీలిస్తామని, త్వరలో తెలంగాణకు అధికారులు, రైతులతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని తెలిపారు. అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తుమ్మల తెలిపారు.
మకానాపై తెలంగాణ ఆసక్తి: బిహార్లోని మకానా సాగు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్ విధానాలపై మంత్రి తుమ్మల ఆసక్తి వ్యక్తం చేశారు. మకానా క్లస్టర్లను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బిహార్కు పంపనున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల అనుభవాల పరస్పర మార్పిడితో రైతుల ఆదాయం, ఉత్పాదకత, మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్లో జరిగిన అర్బన్ ఫార్మింగ్ & కిచెన్ గార్డెనింగ్ ఎక్స్పో–2026లో మంత్రి తుమ్మల పాల్గొని, బాల్కనీలు, టెర్రస్లు, ఇంటి ప్రాంగణాల్లో కూరగాయలు, ఆకుకూరలు, మూలికలను పెంచేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. “తాజాగా పండిద్దాం.. ఆరోగ్యంగా తిందాం.. పచ్చగా జీవిద్దాం” అనే సందేశం ప్రతి కుటుంబ జీవన విధానంగా మారాలని ఆకాంక్షించారు.



