స్థానిక జయశంకర్ భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పలు సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, భూ సమస్యలు, ఉద్యోగుల పదోన్నతులు, రోస్టర్ విధానం (ROR), ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులు ఆయా వర్గాల నివాస ప్రాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మాత్రమే వినియోగించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నిధుల వినియోగంలో నిర్లక్ష్యం లేదా అవకతవకలు చోటుచేసుకుంటే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, పదోన్నతుల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బక్కి వెంకటయ్య సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా, కేసుల దర్యాప్తు మరియు పరిష్కార ప్రక్రియ వేగవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా సమీక్ష సమావేశాలను కొనసాగిస్తామని చైర్మన్ తెలిపారు. త్వరలో ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఆయా జిల్లాల ప్రజలు, సామాజిక వర్గాల నాయకుల నుంచి సమస్యలు, ఫిర్యాదులను నేరుగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొని జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై వివరాలను కమిషన్ చైర్మన్కు అందించారు.


