గొల్లల మామిడాడ, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): మెగాస్టార్ చిరంజీవి జన్మదినం, రాజయోగిని దాది ప్రకాష్మణి 19వ పుణ్యతిథి సందర్భంగా గొల్లల మామిడాడ బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానాన్ని ప్రోత్సహించడంలో చిరంజీవి అందించిన స్ఫూర్తి అభినందనీయమన్నారు. రక్తదానంపై గతంలో ఉన్న అపోహలను తొలగించి, యువతలో సేవాభావాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యసన రహిత భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మాదకద్రవ్యాలు, ధూమపానం, మద్యం వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిజ్ఞ చేయడంతో పాటు దాన్ని ఆచరణలో పెట్టడం ముఖ్యమన్నారు.
ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యసనాలకు అలవాటు పడిన వారిలో మార్పు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఓర్పు, సహనంతో కృషి చేయాలని తెలిపారు.
చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్రెడ్డి, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






