సత్తుపల్లి /ఖమ్మం
నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటన అత్యంత దారుణమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తుకు సరైన మార్గం చూపించే గురువులు తల్లిదండ్రులతో సమానమని అన్నారు.
విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంచేందుకు ఉపాధ్యాయులు మందలించడం వారి బాధ్యతలో భాగమేనని పేర్కొన్నారు. గురువు మందలింపును కక్షగా భావించి ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం బాధాకరమన్నారు. విద్యార్థులు సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావం, చెడు స్నేహాలు, వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని కోరారు. గురువులను గౌరవించడం అంటే విద్య, జ్ఞానం, భవిష్యత్తును గౌరవించడమేనని పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమష్టిగా బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.



