పల్నాడు జిల్లా, మాచర్ల,నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాచర్ల రూరల్ సీఐ వేణు ఆధ్వర్యంలో గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాల్లో 29 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రెండు గొడ్డళ్లు, ఒక గడ్డపలుగు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెల్దుర్తి ఎస్సై సత్యనారాయణ, మాచర్ల రూరల్ ఎస్సై వెంకట్రావు, కారంపూడి ఎస్సై వాసుతో పాటు సుమారు 30 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రూరల్ సీఐ వేణు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేస్తామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.
వాహనదారులు సరైన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.
డ్రగ్స్, మాదకద్రవ్యాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఐ సూచించారు. డ్రగ్స్ వినియోగం లేదా విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసుల నిఘా, ముందస్తు భద్రతా చర్యలు కొనసాగుతాయని సీఐ వేణు స్పష్టం చేశారు.



