– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ముక్కా వరలక్ష్మి
– భక్తిశ్రద్ధలతో తరలివచ్చిన స్థానికులు, భక్తులు
పెనగలూరు మండలం ఓబిలి బీసీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, స్థానిక నాయకులు ముక్కా వరలక్ష్మిని శాలువాతో సన్మానించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆమె అభినందించారు. గ్రామాల్లో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత, సామాజిక సేవా భావం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.



