ఎస్.కోట, ఎల్.కోట మండలాల జడ్పీటీసీ అభ్యర్థులను సన్మానించిన నాదెండ్ల మనోహర్
విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 29. ( పున్నమే ప్రతినిధి)
అమరావతి: 2021స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన ఎస్.కోట మండలానికి చెందిన వబ్బిన సన్యాసి నాయుడు, ఎల్.కోట మండలానికి చెందిన పులిబంటి సంతోష్లను జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ఘనంగా సన్మానించారు.
అమరావతిలోని సి.కె. కన్వెన్షన్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన జనసైనికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, 2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిళ్లు, దాడులను ఎదుర్కొంటూ జనసేన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులను మంత్రి నాదెండ్ల మనోహర్ కండువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్.కోట మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థి వబ్బిన సన్యాసి నాయుడు, ఎల్.కోట మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థి పులిబంటి సంతోష్లను ప్రత్యేకంగా సన్మానించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గతంలో చూపిన స్ఫూర్తి, ధైర్యంతో జనసేన నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని, కూటమి పార్టీల సమన్వయంతో వైసీపీని ఎదుర్కొని విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
2014 నుంచి జనసేన పార్టీతో ప్రయాణిస్తూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం లభించాలన్నదే జనసైనికుల ఆకాంక్ష అని నాయకులు పేర్కొన్నారు.



