మణుగూరు, ఆగస్టు 31: మణుగూరు మండలం విఠల్రావునగర్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి, లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు రావుల పరిమిళ, బిజిగి కోటేశ్వరి, గంగిశెట్టి ఎల్లమ్మ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. నూతన గృహాల్లో వారు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర నాయకులు, మైనారిటీ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





