భద్రాచలం, ఆగస్టు 31: మహిళల శుభకార్యాలు, సంప్రదాయాలపై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను మహిళా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వారు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.
ప్రజల కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు హాజరై వారి సంతోషంలో భాగస్వామి కావడం ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే బాధ్యత అని తెలిపారు. మహిళలు నిర్వహించే ఓణీల కార్యక్రమాలు, పంచకట్టు వేడుకలు, ఇతర శుభకార్యాలకు ఎమ్మెల్యే హాజరవడాన్ని అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేయడం మహిళలను, భారతీయ సంప్రదాయాలను అవమానించడమేనని అన్నారు. మహిళా కాంగ్రెస్ నాయకురాలు జాస్తి గంగా భారతి మాట్లాడుతూ ఎమ్మెల్యే మహిళల శుభకార్యాలకు వెళ్లి ఆశీర్వదిస్తే తప్పేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్స్ ఎంపీటీసీ మానే కమల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళల సంక్షేమంపై మాట్లాడే ముందు బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ నేతల వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు పిట్టల లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రజలతో ఆత్మీయంగా మెలుగుతూ ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. మహిళా కాంగ్రెస్ నాయకురాలు కాసింబి మాట్లాడుతూ మహిళలపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని మహిళా కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గుర్రల సత్యవేణి, షేక్ మైదులిబి, విజయలక్ష్మి, ఉమా తదితరులు పాల్గొన్నారు.



