అనపర్తి, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. అనపర్తి సచివాలయం-5 వద్ద ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
వర్షాలు అధికంగా కురవడం మాత్రమే ప్రకృతి వైపరీత్యం కాదని, వర్షాభావ పరిస్థితులు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, సాగునీరు, భూగర్భజలాల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. గోదావరి డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం సాగునీటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
ఉష్ణోగ్రతల్లో అసమతుల్యత కారణంగా వరి పంటకు చీడపీడల సమస్యలు పెరిగి పెట్టుబడి వ్యయం అధికమయ్యే అవకాశం ఉందని, దిగుబడులపై కూడా ప్రభావం పడవచ్చని రైతులను అప్రమత్తం చేశారు. భవిష్యత్లో సాగునీటితో పాటు తాగునీటి లభ్యతపై కూడా ముందస్తు ప్రణాళిక అవసరమని సూచించారు.
ప్రకృతిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణపై రైతులు అవగాహన పెంచుకోవాలని నల్లమిల్లి కోరారు. కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను రైతులు సందర్శించి నూతన పద్ధతులపై అవగాహన పొందాలని సూచించారు.
కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.











