యలమంచిలి : పున్నమి ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు మండలంలో ప్రతి బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఏటికొప్పాక గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. రోడ్లను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. మండలంలోని అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులను ఒక బృందంగా ఏర్పాటు చేసి, ప్రతి బుధవారం ఒక్కో గ్రామంలో స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించాలని అధికారులు సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాదరావు, పంచాయతీ సిబ్బంది, ఇతర గ్రామాల నుంచి వచ్చిన శానిటేషన్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.

