ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతే “ఇందిరమ్మ రాజ్యం” లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల కల నెరవేరలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఈ ఏడాది ఖమ్మం నియోజకవర్గానికి 2,000 ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు. ఇంకా అర్హులు ఉంటే వారికి కూడా ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.
పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.
మహిళల సాధికారత కోసం డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, మహిళల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

