అనపర్తి, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఏరియా ఆసుపత్రి, తిలక్ రెడ్డి వర్తక సంఘం కళ్యాణ మండపం, వెంకటరత్నపురంలో నిర్వహించిన వేడుకల్లో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
అనంతరం అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో లక్ష్మీనరసపురం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇళ్ల పట్టాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో అధిక పని దినాలు కల్పించడంలో విశేష కృషి చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం కల్పించేందుకు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో అధికారులు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










