కేశవరం వీఆర్వో వీరవేణికి ఉత్తమ ఉద్యోగి పురస్కారం
మండపేట, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): మండపేట మండలం కేశవరం గ్రామ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న పేరూరి వీరవేణికి ఉత్తమ ఉద్యోగి పురస్కారం లభించింది. రాజమహేంద్రవరంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐ.ఏ.ఎస్. చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2020 నుంచి కేశవరం గ్రామంలో వీఆర్వోగా సేవలందిస్తున్న వీరవేణి, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణతో పాటు వివిధ ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు పొందారు. ఆమె సేవలను గుర్తించి ఉత్తమ పురస్కారం ప్రదానం చేయడంపై కేశవరం గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.






