ఆత్మకూరు, ఆగస్టు 30 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలోని స్పార్క్ సిటీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన, భూమిపూజా కార్యక్రమం ఆదివారం ఉదయం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది.ఈ దివ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్నినెలకొల్పింది.శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన పవిత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలతో స్పార్క్ సిటీ పరిసర ప్రాంతమంతా శివ–సుబ్రహ్మణ్య నామస్మరణతో మార్మోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి శంకుస్థాపన మహోత్సవాన్ని భక్తిపూర్వకంగా తిలకించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ఆత్మకూరు ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ మహోత్సవానికి ఆత్మకూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.


