ఖమ్మం, జూన్ 18
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
సత్తుపల్లి మెగా ఫుడ్ పార్క్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జాతీయ నాయకుడు, కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ Ponguleti Sudhakar Reddy డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు Nelluri Koteswara Rao ఆధ్వర్యంలో బుధవారం సత్తుపల్లి ఫుడ్ పార్క్ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం ఏర్పాటు చేసిన రూ.109.50 కోట్ల మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్టు పారదర్శకత లేకుండా నడిచిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.49.70 కోట్ల నిధులు అందించగా, రాష్ట్ర ప్రభుత్వం భూముల సేకరణ బాధ్యత మాత్రమే నిర్వహించాల్సి ఉందన్నారు.
స్థానిక రైతుల నుంచి అత్యల్ప ధరలకు భూములు సేకరించి, అనంతరం వాటిని కార్పొరేట్ సంస్థలకు కేటాయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశతో రైతులు తమ భూములను ఇచ్చారని, అయితే వారి ఆశలను ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి 84 ఎకరాల భూమి కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన, ‘దీపక్ నెక్స్ జెన్’ సంస్థకు మార్కెట్ ధర కంటే తక్కువకు భూములు కేటాయించారని ఆరోపించారు. కేబినెట్ ఆమోదం లేకుండానే భూకేటాయింపులు జరిగాయా అనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫుడ్ పార్క్ వ్యవహారంలో జరిగిన అన్ని లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. అవసరమైతే కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లతో విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు.
ఈ వ్యవహారంలో రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం సత్తుపల్లి సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నలగడ్డ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, జిల్లా కార్యదర్శి వీరంరాజు తదితరులు పాల్గొన్నారు.



