*రైతాంగానికి అండగా సమగ్ర ప్రణాళికలు: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత* .
*రబీ సీజన్కు ప్రణాళికలు, సూక్ష్మ పరిశ్రమల స్థాపన మరియు ప్రత్యామ్నాయ జీవనోపాధుల సృష్టి ద్వారా జిల్లా ఆర్థిక రంగానికి బహుముఖ మద్దతు* .
*రైతులకు సమగ్ర ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy) మరియు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పై ప్రత్యేక కార్యాచరణ* .
*రైతుల ఆర్థిక శ్రేయస్సు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు మరియు యువత నైపుణ్యాభివృద్ధికి బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశం* .
*మార్కాపురం,16.9.26*
మార్కాపురం జిల్లా సహజ వర్షాఛాయ భౌగోళిక పరిస్థితులు మరియు ఎల్ నినో వల్ల ఎదురైన తాత్కాలిక వర్షాభావ పరిస్థితులను అధిగమించి, జిల్లాలోని ప్రతి రైతుకూ, గ్రామీణ కుటుంబానికీ ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టం చేశారు. ఖరీఫ్లో నికర సాగు విస్తీర్ణం (Net Sown Area) 76% తగ్గినప్పటికీ, రాబోయే రబీ సీజన్కు విస్తృతమైన రుణ ప్రణాళికలు, ముందస్తు విత్తన/పెట్టుబడి సహాయ చర్యలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.
బుధవారం మార్కాపురం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నందు లీడ్ బ్యాంక్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC) మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) ఉమ్మడి సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు.
2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (జూన్ 2026 నాటికి) వార్షిక రుణ ప్రణాళిక (ACP) సాధించిన పురోగతిపై సమీక్షిస్తూ, జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకింగ్ రంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మార్గదర్శకాలు* :
1. రబీ సమగ్ర సాగుకు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ ప్రాధాన్యత:
వర్షాభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి రబీ కాలం గొప్ప ఉపశమనం కలిగిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. రబీ పంటల సాగు కోసం రైతులకు అవసరమైన రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం, మరియు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా బ్యాంకులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
2. రైతు సాధికారతకు ప్రత్యేక ‘ఆర్థిక అక్షరాస్యత’ కార్యక్రమాలు:
జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా, రైతాంగం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ మరియు ఆర్థిక సేవల విస్తరణ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేపట్టాలని బ్యాంకింగ్ వర్గాలను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా, వడ్డీ లేని పంట రుణాలు మరియు బ్యాంకింగ్ పథకాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
3. సూక్ష్మ పరిశ్రమలు (Micro Enterprises) & విశ్వకర్మ యోజన ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి:
వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉపాధి మార్గాలను పెంచేందుకు సూక్ష్మ పరిశ్రమలను గరిష్టంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకం ద్వారా సాంప్రదాయ చేతివృత్తుల వారికి నాణ్యమైన పరికరాలు, రోజువారీ స్టైఫండ్తో కూడిన నైపుణ్య శిక్షణ, మరియు పూచీకత్తు లేని రుణ సదుపాయాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆదేశించారు.
4. పశుసంవర్ధకం, మత్స్య రంగానికి ఊతం:
రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చే పశుసంవర్ధక మరియు మత్స్య రంగానికి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డుల దరఖాస్తులను వేగవంతం చేసి, కేవలం 15 రోజు వ్యవధిలో ఆమోదించి రుణాలు విడుదల చేయాలని ఆదేశించారు.
5. సమర్థవంతమైన సమన్వయం & యువత నైపుణ్యాభివృద్ధి:
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వ శాఖలు మరియు బ్యాంకింగ్ రంగాలు సంపూర్ణ సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. RUDSETI వంటి శిక్షణా సంస్థల ద్వారా జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, స్వయం ఉపాధి మరియు నూతన అవకాశాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ షాహీర్, జిల్లా వ్యవసాయ అధికారి, డి.ఆర్.డి.ఎ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు మరియు బ్యాంకింగ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:




