కడప జిల్లా – బద్వేల్
బద్వేల్లో టీడీపీ ఫ్లెక్సీల వివాదం.. పార్టీ వర్గాల్లో చర్చ
బద్వేల్లో ఇటీవల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమితులైన మంచూరి సూర్యనారాయణ రెడ్డి చేపట్టిన భారీ ర్యాలీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇన్చార్జి పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన అనుచరులు పట్టణంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రాలు లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
పార్టీ అధిష్ఠానం పదవి బాధ్యతలు అప్పగించిన కొద్ది రోజులకే ముఖ్య నేతల చిత్రాలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై అధికారికంగా పార్టీ నాయకత్వం లేదా సంబంధిత వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా, ఈ అంశం ప్రస్తుతం బద్వేల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

