ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు.. ప్రాణభయంతో కుటుంబం
తక్షణమే తీగలు తొలగించాలని బాధితుడి, గ్రామస్తుల డిమాండ్
రెబ్బెన, ఆగస్టు 3 (పున్నమి రిపోర్టర్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం బిక్కయ్య నివాస గృహంపై విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిపై నుంచి విద్యుత్ తీగలు వెళ్లడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో కుటుంబ సభ్యులు జీవిస్తున్నారని తెలిపారు.
ఈ సమస్యపై గ్రామ సర్పంచ్తో పాటు విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుర్గం బిక్కయ్య వాపోయారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విద్యుత్ తీగల వల్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదం సంభవించిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు చర్యగా వెంటనే ఇంటిపై వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించి సురక్షితంగా మార్చాలని బాధిత కుటుంబం, గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.




