ఆత్మకూరులో రేపు వినాయక నిమజ్జనోత్సవం.. హాజరుకానున్న మంత్రి ఆనం
సెప్టెంబర్ 16న మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో స్వాగత వేదిక
ఆత్మకూరు, సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి): వినాయక మహోత్సవాలను పురస్కరించుకుని ఆత్మకూరు పట్టణంలో బుధవారం (సెప్టెంబర్ 16) వినాయక నిమజ్జన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఆత్మకూరు వినాయక ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమానికి హాజరుకానున్నారు.
సాయంత్రం 6 గంటలకు మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద మంత్రి ఆనం పాల్గొని గణనాథునికి వీడ్కోలు పలకనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ వినాయక విగ్రహాల నిర్వాహకులు నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.
విగ్రహాలను నిర్ణయించిన సమయపాలన, నియమ నిబంధనలను పాటిస్తూ క్రమపద్ధతిలో తరలించాలని సూచించింది. నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు, భక్తులు సహకరించాలని కోరింది. ఆనందోత్సాహాల నడుమ గణనాథుని నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ పిలుపునిచ్చింది.


