దమ్మపేట, జూన్ 28: పాల్వంచ అటవీ డివిజన్ పరిధిలోని దమ్మపేట అటవీ రేంజ్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చేపట్టిన తనిఖీల్లో భాగంగా పుసుకుంట చెక్పోస్ట్ వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 27న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇసుక లోడుతో వచ్చిన ట్రాక్టర్ను సిబ్బంది పరిశీలించారు. ఇసుక రవాణాకు సంబంధించి చెల్లుబాటు అయ్యే అనుమతులు, పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్ను ఇసుక లోడుతో సహా అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనపై సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి విచారణ, చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. శ్రీను తెలిపారు. అక్రమ ఇసుక, అటవీ వనరుల తరలింపును అరికట్టేందుకు చెక్పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగుతాయని, అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడవద్దని, ఇలాంటి కార్యకలాపాల సమాచారం తెలిస్తే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.




