హర్షధ్వానాల మధ్య రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం
2026-27 విద్యా సంవత్సరానికి శ్రీకారం – 227 పనిదినాలతో విద్యా బోధన ప్రారంభం
హైదరాబాద్, జూన్ 14:
వేసవి సెలవులకు వీడ్కోలు పలుకుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి (జూన్ 15) నుంచి 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దాదాపు రెండు నెలల విరామం అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి విద్యాలయాల బాట పట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఆదర్శ, కేజీబీవీ, గురుకుల, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలు ప్రారంభం కానుండటంతో పాఠశాల ప్రాంగణాలు మళ్లీ విద్యార్థుల సందడితో కళకళలాడనున్నాయి.
ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉండనున్నాయి. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పాఠశాలల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, విద్యుత్, మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇదిలా ఉండగా, విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని రూట్లలో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తగినన్ని బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రయాణ ఇబ్బందులు తలెత్తకుండా పాత రూట్లను పునరుద్ధరించడంతో పాటు అవసరమైతే అదనపు ట్రిప్పులు కూడా నడపాలని సూచించారు.
విద్యార్థులు సమయానికి పాఠశాలలకు చేరుకునేలా బస్సుల సమయపాలన పాటించాలని, రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త విద్యా సంవత్సరానికి ప్రభుత్వం, విద్యాశాఖ, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరుకానున్నారు. కొత్త తరగతులు, కొత్త పాఠ్యాంశాలు, కొత్త ఆశయాలతో విద్యార్థులు విద్యా ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.
పున్నమి న్యూస్ ప్రత్యేక కథనం



