ఆత్మకూరు, జూలై 19 (పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ కార్యాలయంలో విద్యా వైద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరంలో 60 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కె. రమణారెడ్డి మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఆపదలో ఉన్న వారికి ప్రాణాలు కాపాడే అవకాశాన్ని కల్పించే ఈ మహోన్నత కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రతి రక్తదాత అభినందనీయుడని పేర్కొన్నారు. సమాజ సేవలో భాగంగా ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.రక్త నిల్వలను పెంచేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని, యువత పెద్ద ఎత్తున ముందుకు రావడం సంతోషకరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డివిజన్ సంక్షేమ విద్యా సహాయకులు, పట్టణంలోని పలు మొబైల్ షాపుల ప్రతినిధులు, నబ్బీనగరం, పొనుగోడు, మురుగళ్ల, జంగాలపల్లి తదితర గ్రామాలకు చెందిన యువకులు, సేవాభావం కలిగిన స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


