మర్రిపాడు మండలంలో విద్యార్థుల విద్యాభివృద్ధి,సంక్షేమం లక్ష్యంగా సాహో ఫౌండేషన్,మర్రిపాడు వారి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు ల్యాప్టాప్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ లేని విద్యార్థులలో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన టాప్ టెన్ విద్యార్థులలో మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి రూ.10,000 చొప్పున,మిగిలిన ఏడు మంది విద్యార్థులకు రూ.5,000 చొప్పున నగదు బహుమతులు అందించారు.అలాగే ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులలో మొదటి రెండు స్థానాలు సాధించిన వారికి రూ.10,000 చొప్పున,మిగిలిన మూడు స్థానాలు సాధించిన వారికి రూ.5,000 చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు.ఇదే కార్యక్రమంలో రోటరీ క్లబ్, సైబరాబాద్ వారి సౌజన్యంతో బి.టెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు.ఈ సందర్భంగా సాహో ఫౌండేషన్ వ్యవస్థాపకులు,నిష్బిట్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత పడచల నాగేశ్వరరావు మాట్లాడుతూ,కొన్ని కుటుంబాలలో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోవడం వల్ల విద్యార్థుల జీవితాల్లో నిర్లిప్తత,ఆత్మ విశ్వాసం లోపించే అవకాశముందని,అలాంటి విద్యార్థులకు అండగా నిలిచి వారి విద్యాభివృద్ధికి తోడ్పడటమే సాహో ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన ఆత్మకూరు డివిజనల్ విద్యాశాఖాధికారి జానకిరామ్ మాట్లాడుతూ,మర్రిపాడు మండలంలో విద్యార్థుల సంక్షేమం కోసం సాహో ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఘనంగా కొనియాడారు.రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు తిరుపతయ్య,ధనలక్ష్మి,చిలకపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ మారుతి కేశవరెడ్డి,బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. శ్రీనివాసులు,పొంగూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు,కేజీబీవీ ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి,విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జొన్న సత్యనారాయణ,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పడచల రామయ్య,సాహో ఫౌండేషన్ సభ్యులు కర్యావుల రమణయ్య,పడచల నాగేశ్వరరావు సతీమణి సునీత,వారి తల్లి సుబ్బమ్మ,దయాకర్ రెడ్డి,రవి కుమార్,మార్గదర్శి ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






