ఆత్మకూరు, (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు మండలం వెన్నవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన గ్రామానికి చేరుకోగానే గ్రామ మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి, పూల వర్షం కురిపిస్తూ కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా విద్యార్థులు పరమేశ్వర రెడ్డి అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడుతూ.. “మీరు మాపై చూపిస్తున్న ఆదరణకు మేము ఇచ్చే అతిపెద్ద బహుమతి మా చదువు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజానికి సేవ చేస్తాం” అని తెలిపారు.విద్యార్థుల మాటలకు స్పందించిన పరమేశ్వర రెడ్డి వారిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు.“లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిది. చిన్ననాటి నుంచే ఉన్నత ఆశయాలను ఏర్పరచుకుని శ్రమ, పట్టుదలతో ముందుకు సాగాలి” అని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతోమంది గొప్ప వ్యక్తులు దేశానికి సేవ చేశారని, విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.పాఠశాల వార్షికోత్సవంలో ప్రకటించిన విధంగా సరస్వతి మందిరం నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రధానోపాధ్యాయులను కోరారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతగా ప్రధానోపాధ్యాయులు రవికుమార్, గ్రామస్తులు, తల్లిదండ్రులు కంచి పరమేశ్వర రెడ్డి గారిని గజమాలతో, శాలువాతో సత్కరించి పుష్ప కిరీటాన్ని బహూకరించారు.పాఠశాల అభ్యున్నతికి సహకరించిన దాతలకు ప్రభుత్వం అందజేసిన ప్రశంసా పత్రాలను పరమేశ్వర రెడ్డి చేతుల మీదుగా అందించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు రవికుమార్ను ఘనంగా సత్కరించారు.


