18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలి.
అమలాపురం,పున్నమి దినపత్రిక: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలు నుండి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ వివేక్ యాదవ్, అడిషనల్ సీఈవో లు ఢిల్లీ రావు,వెంకటేశ్వరరావు లతో కలిసి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణకు సంబంధించి నోటీసులు జారీ,పంపిణీ, నోటీసు విచారణ,నోటీసు అందజేత, ఫారం-6,6ఎ,7,8 నిర్వహణ క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలు, ఎన్ జి ఎస్ పి వంటి అంశాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా పనులు పూర్తయ్యాయని, పెండింగ్లో ఉన్న పనులను త్వరతిగతిన పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని తెలియజేశారు.అదే విధంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.కొత్త ఓటర్లకు Form-6 పై అధికారులు అవగాహన కల్పించి,ఓటరు జాబితాలో వివరాలను నమోదు చేసుకునే విధంగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
యువ ఓటర్లు “నా ఓటు – నా బాధ్యత” అనే స్ఫూర్తితో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, యువజన సంఘాలు కూడా అర్హత కలిగిన యువతను ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి సుబ్బారావు, జిల్లా పరిపాలన అధికారి నాగ లక్ష్మమ్మ, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




