యాచారం సమస్యలపై సీపీఎం సమర శంఖం!
ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి
యాచారం, ఆగస్టు 31:
స్థానిక సమస్యలు, భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ మాట్లాడుతూ మండలంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను ప్రభుత్వం, అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ధర్మన్నగూడ నుంచి పెత్తుల వరకు బీటీ రోడ్డుకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని, నందివనపర్తి, సింగారం, కురిమిద్య, తాడిపర్తి గ్రామాల్లోని సుమారు 1,400 ఎకరాల దేవాదాయ భూములను కౌలు రైతుల పేర్లపై పట్టా చేసి పట్టాదారు పాస్బుక్కులు మంజూరు చేయాలని కోరారు.
ఫార్మాసిటీ నిషేధిత జాబితాలో ఉన్న రైతుల పేర్లను తొలగించి, వారికి అన్ని హక్కులు, ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చింతపట్ల గ్రామంలోని సర్వే నంబర్లు 209, 210లోని రెండు ఎకరాల భూమిని అర్హులైన పేదలకు ఇంటి స్థలాలుగా కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
మంథన్గౌరెల్లి గ్రామంలోని సర్వే నంబర్ 104లో ఉన్న 1 ఎకరం 5 గుంటల స్మశానవాటిక భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి రక్షించాలని డిమాండ్ చేశారు.
మండలంలోని అన్ని గ్రామాలు, తండాలకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అన్ని గ్రామాలకు కృష్ణా జలాల సరఫరా పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, అన్ని రకాల భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రజలను చైతన్యపరిచి ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి. అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. చందునాయక్, ఆలంపల్లి జంగయ్య, మండల కమిటీ సభ్యులు వెంకటయ్య, బాలరాజ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీమన్నారాయణ, మాజీ సర్పంచ్ ఎం. భాషయ్య, శాఖ కార్యదర్శులు రమేష్, జంగయ్య, సురేష్, నాయకులు జంగారెడ్డి, రాములు, కుమార్, భాస్కర్, పంతునాయక్, పాల్గొన్నారు.




