జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావును ప్రకటించడం, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ–జనసేన పొత్తులపై ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పువ్వాడ నాగేంద్ర కుమార్, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావును ఫోన్లో సంప్రదించారు.
పువ్వాడ నాగేంద్ర కుమార్: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ–జనసేన పొత్తులపై మీ అభిప్రాయం ఏమిటి?
నెల్లూరి కోటేశ్వరరావు: ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారం బీజేపీ జాతీయ పార్టీ నాయకత్వానిదే. రాష్ట్ర స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో ఎవరూ ముందస్తుగా నిర్ణయం తీసుకోలేరు. జాతీయ పార్టీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది.
పువ్వాడ నాగేంద్ర కుమార్: జనసేన ప్రకటనపై బీజేపీ జిల్లా నాయకత్వం ఎలా స్పందిస్తోంది?
నెల్లూరి కోటేశ్వరరావు: జనసేన తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించింది. బీజేపీ కూడా తన పార్టీ నిర్ణయాల ప్రకారం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా ఖమ్మం జిల్లాలో బీజేపీ ముందుకు సాగుతుందని నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టం చేశారు.


