ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును పార్టీ ముందస్తుగా ప్రకటించింది. జనసేన రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయిలో సేవలందించిన గడల శ్రీనివాసరావు తెలంగాణవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందించారు.
జనసేన పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నెమురి శంకర్ గౌడ్ గడల శ్రీనివాసరావు పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్కు ప్రతిపాదించగా, ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. పట్టభద్రులు, ఉద్యోగులు, యువత, విద్యావంతులు, మేధావుల సమస్యలను శాసన మండలిలో బలంగా వినిపించి పరిష్కారానికి కృషి చేస్తానని గడల తెలిపారు. తనకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్, రామ్ తాళ్లూరి, నెమురి శంకర్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు జిల్లాల పట్టభద్రుల ఆశీస్సులతో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని తెలంగాణలో జనసేన సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.



