పున్నమి ప్రతినిధి ( ఆగస్టు 08):వేముల,
వేముల మండల డీఆర్డీఏ వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డేరంగుల ఆంజనేయులు దివ్యాంగుల సంక్షేమానికి తనవంతు సహాయాన్ని అందించారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేముల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న దివ్యాంగుల కమ్యూనిటీ భవనంలో దివ్యాంగులు, మిత్రుల మధ్య కేక్ కట్ చేసి పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దివ్యాంగుల టైలరింగ్ శిక్షణ కేంద్రానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని కుట్టు శిక్షణ ఉపాధ్యాయురాలు మల్లీశ్వరికి అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. దివ్యాంగులు ఆత్మన్యూనతా భావాన్ని వీడి, “Knowledge is Power – Will ఉంటే, Skill ఉంటే విజయం మీదే” అనే స్ఫూర్తితో శిక్షణను పూర్తి చేసి స్వయం ఉపాధి సాధించాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుని మహిళలు మెరుగైన జీవనోపాధిని పొందాలని సూచించారు. “Pay Back to the Society” అనే ఆలోచనతో సమాజానికి తమవంతు సేవ చేయాలని, తద్వారా అద్భుతమైన ఆలోచనలు, మంచి ఆచరణ కలిగిన వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
దివ్యాంగుల పట్ల ఆంజనేయులు చూపుతున్న సేవా స్ఫూర్తిని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల నెట్వర్క్ అధ్యక్షులు రఘునాథ రెడ్డి, సంఘ సేవకులు నక్కలపల్లి కొండారెడ్డి, లింగాల ఉపాధి హామీ పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ గంగరాజు, వార్డు వెల్ఫేర్ సెక్రటరీలు విజయభాస్కర్, నాగలింగం, దివ్యాంగులు, మహిళలు, ఆంజనేయులు మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.






